- సమన్వయంతో పనిచేసి జూలై 30లోపు ప్రత్యేక సవరణ పూర్తి చేయాలి
ఆమనగల్లు, జూలై 25 (చైతన్యగళం):
ప్రతి బూత్లో అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు నమోదు చేయించడం కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కల్వకుర్తి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల బీఎల్ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు), బూత్ కమిటీ సభ్యులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పార్టీ బలోపేతం, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, బూత్ నిర్వహణ, కార్యకర్తల బాధ్యతలపై కీలక దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఏలు గ్రామాలు, బూత్ల వారీగా 85 శాతం ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేశారని పేర్కొంటూ సమర్థంగా పనిచేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. మిగిలిన ప్రక్రియను వేగవంతం చేసి జూలై 30లోపు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పేర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి ఇంటికి చేరుకుని ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామాలు, తండాలు, వార్డుల్లో పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా నిర్వహించాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని, ప్రతి కార్యకర్త పార్టీకి బలమైన ప్రతినిధిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని పేర్కొన్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాయకులు, బీఎల్ఏలు, బూత్ కమిటీ సభ్యులు సమష్టిగా పనిచేస్తే కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. సమావేశంలో టీపీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ సభ్యుడు ఠాకూర్ బాలాజీ సింగ్, కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, మండల అధ్యక్షులు కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బాల్ రెడ్డి, భట్టు కిషన్ రెడ్డి, పోతుగంటి శంకర్, కాసు శ్రీనివాస్ రెడ్డి, హరి కిషన్ నాయక్, మున్సిపల్ అధ్యక్షుడు అవ్వారి శివలింగం, పుస్తకాల రాహుల్తో పాటు పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, బీఎల్ఏలు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
