షాద్నగర్, జూలై 21 (చైతన్యగళం):
ఆషాఢ మాసం తొలి మంగళవారం సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారిని శాఖంబారి దేవి అవతారంలో అత్యంత వైభవంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకులు వాసు పంతులు వేదమంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖంబారి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి మాతను దర్శించుకునేందుకు మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
అమ్మవారికి పూలు, పండ్లు, కూరగాయలతో విశేష అలంకరణ చేయడంతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. భక్తులు ప్రత్యేక అర్చనలు నిర్వహించి కుటుంబాల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కోసం ప్రార్థనలు చేశారు.
పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వైశ్య సంఘ ప్రతినిధులు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
