మహబూబాబాద్, జూలై 20(చైతన్యగళం):
స్థానిక మోడల్ స్కూల్, అనంతారంలో సోమవారం నిర్వహించిన “ఇన్-సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్ – ట్రాన్స్ఫార్మేటివ్ క్లాస్రూమ్ ఆక్టివిటీస్” కార్యక్రమంలో ఏసీజీఈ సెంటర్ ఇన్చార్జ్ మందుల శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయులు సాంప్రదాయ బోధనతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించి విద్యార్థుల అభ్యాసాన్ని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దాలి” అని సూచించారు.
విద్యార్థుల్లో సమస్య పరిష్కార నైపుణ్యం, సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన, సహకార భావన వంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలను పెంపొందించే బోధనా పద్ధతులను ఉపాధ్యాయులు అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలుగు ఉపాధ్యాయులు కథలు, పద్యాలు, పఠన, రచనా కార్యక్రమాలను వినియోగించి భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయాలని, సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు మ్యాపులు, చార్టులు, ప్రాజెక్టులు, గ్రూప్ చర్చల ద్వారా పాఠ్యాంశాలను వాస్తవ జీవితంతో అనుసంధానం చేయాలని, బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులు ప్రయోగాలు, పరిశీలనలు, ప్రకృతి అధ్యయనం ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని సూచించారు.
శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో సమర్థవంతంగా అమలు చేసి ప్రతి విద్యార్థి అభ్యాస ఫలితాలను మెరుగుపరచాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు.
ఈ కార్యక్రమంలో తెలుగు డీఆర్పీలు తండా హరీష్, గుర్తి సురేష్, ప్రవీణ్ కుమార్, ప్రసాద్, సోషల్ స్టడీస్ డీఆర్పీలు శ్రీశైలం, శాంసన్, రమేష్, యాకుబ్ అలీ, సుధాకర్, బయోలాజికల్ సైన్స్ డీఆర్పీలు సునీత, రామ్మోహన్, నవీన్, భాస్కర్తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
