పెద్దపల్లి, జూలై 17 (చైతన్యగళం): తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్గా సలేంద్ర కొమరయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “సామాజిక న్యాయమే నా లక్ష్యం” అని స్పష్టం చేశారు.
పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీసీలకు 50 శాతం రాజకీయ వాటా కల్పిస్తామన్న హామీ వెనుకబడిన వర్గాలకు కొత్త ఆశను కల్పించిందని ఆయన కొనియాడారు. పెద్దపల్లిలో అగ్రవర్ణాల ఆధిపత్యం కారణంగా బీసీలు కేవలం ఓటు బ్యాంకుగా మారిన పరిస్థితిని గుర్తుచేస్తూ, ఇప్పుడు ఒక బీసీ నాయకుడికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడం సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడమేనని వ్యాఖ్యానించారు.
పాంచజన్యం పథకాలు వెనుకబడిన తరగతుల కోసం రూపొందించబడ్డాయని, వాటిని ప్రతి గడపకు తీసుకెళ్లడమే తన ప్రధాన కర్తవ్యమని కొమరయ్య తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో వెనకడుగు వేయకుండా పోరాడిన స్ఫూర్తితోనే పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కవితకు అండగా ఉంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
జిల్లా రక్షణ సేన శ్రేణులు, బీసీ సంఘం నేత ఉస్తేం శ్రీనివాస్ ముదిరాజ్ సహా పలువురు నాయకులు సలేంద్ర కొమరయ్య నియామకంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో బొంగోని శంకరయ్య గౌడ్, బొంకూరి సుభాష్, కల్వల తిరుపతి, చిట్టుమల్ల హనుమాండ్లు, చిలుక ఆనంద్, గడ్డం వెంకటేష్, ఎంచెర్ల స్వామి, పిల్లి శివ, పల్లె శ్రీనివాస్, మేకల శ్రీనివాస్, రాజ్కుమార్ యాదవ్, విశ్వతేజ, కల్వల రవీందర్, కారుపాకాల రాజేందర్, కారుపాకాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
