కరీంనగర్, జూలై 16 (చైతన్యగళం):
శ్రీ శ్రీ రాధా గోవింద మందిరం, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని శుక్రవారం కరీంనగర్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఉజ్వల పార్క్ సమీపంలోని శ్రీ శ్రీ రాధా గోవింద మందిరం నుంచి ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ తెలిపింది.
కరీంనగర్ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ జగన్నాథ స్వామివారి కృపకు పాత్రులు కావాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. రథయాత్రలో పాల్గొనే భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలని కోరారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు చైతన్యపురి కాలనీలోని మహాశక్తి దేవాలయం నుంచి రథయాత్ర ప్రారంభమై సెయింట్ జాన్స్ హై స్కూల్, న్యూ లేబర్ అడ్డా, ఓల్డ్ లేబర్ అడ్డా, మంకమ్మతోట, టూ టౌన్ పోలీస్ స్టేషన్, గీతాభవన్, బస్టాండ్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, మార్కెట్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, టవర్ సర్కిల్, రాజీవ్ చౌక్ మీదుగా వైశ్య భవన్ వరకు కొనసాగనున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.
భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జగన్నాథ స్వామివారి ఆశీస్సులు పొందాలని వారు విజ్ఞప్తి చేశారు.
