కొంగర కలాన్, జూలై 15 (చైతన్యగళం):
రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (IDOC) సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్ డా. కిరణ్మయి వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా తల్లి‑శిశు ఆరోగ్య సేవలు, జాతీయ టీకాల కార్యక్రమం, క్షయవ్యాధి నియంత్రణ, మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా వంటి సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, కుటుంబ సంక్షేమం, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, డీ‑వార్మింగ్ డే కార్యక్రమం తదితర అంశాల పురోగతిని ఆమె పరిశీలించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జ్వరాలపై ప్రత్యేక నిఘా, ఇంటింటి సర్వేలు, ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. “ప్రతి వైద్య సంస్థలో మందులు, పరీక్షా కిట్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలి. అర్హులందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి” అని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. స్వర్ణ కుమారి, ఉప జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
