దేవరకొండ, జూలై 14 (చైతన్యగళం): హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు సంఘీభావంగా దేవరకొండ పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. డిండి రోడ్డులోని మీనాక్షి సెంటర్ నుండి కోర్టు మీదుగా వందలాది మంది విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డా. చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, “గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రూ.10,500 కోట్ల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే కుట్రలను అడ్డుకుంటాం” అని హెచ్చరించారు.ప్రభుత్వం విద్యార్థులను రోడ్లపైకి నెట్టే పరిస్థితి తీసుకువచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “అన్ని కార్యక్రమాలకు నిధులు ఉంటాయి కానీ పేద, బడుగు బలహీన విద్యార్థుల చదువుకు మాత్రం నిధులు కేటాయించడం లేదు. దశలవారీగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రను అడ్డుకుంటాం” అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రెడ్డి కోటేశ్వరరావు, భీమగొని శివ గౌడ్, అప్పం వీరయ్య, పున్న బిక్షమయ్య, కాటం వెంకటేష్ గౌడ్, ఆడారపు గణేష్, ఆకారపు గౌతమ్, నాగపల్లి సుధాకర్, రామావత్ రాము, ఆంజనేయులు, వింజమూరు వెంకటేశ్వర్లు, లిఖిత, దీపక్, చిన్న నాయక్, శాంతి రాజు, రామావత్ పాండు నాయక్, వర్త్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.
