- మహబూబాబాద్ రోటరీ క్లబ్ నూతన కమిటీ ఘన ప్రమాణ స్వీకారం
మహబూబాబాద్(చైతన్యగళం): సమాజ సేవలో రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. ప్రతి వ్యక్తి సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ తన వంతు సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్లో శుక్రవారం రాత్రి మహబూబాబాద్ రోటరీ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా దూదికట్ల సత్యం బాధ్యతలు స్వీకరించగా, కార్యదర్శిగా శoతన్ రామరాజు, కోశాధికారిగా ముల్లంగి మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా ఎన్.వి. హనుమంత రెడ్డి హాజరై నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. రోటరీ క్లబ్ ఆశయాలు, ప్రపంచ వ్యాప్తంగా సంస్థ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఆయన వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజ సేవకు వినియోగించాలని సూచించారు. “మాధవ సేవ కంటే మానవ సేవే గొప్పది” అనే భావనతో ముందుకు సాగాలని అన్నారు. రోటరీ ఫౌండేషన్ చైర్మన్ ఎన్.వి. హనుమంత రెడ్డి మాట్లాడుతూ…. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో రోటరీ సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. పోలియో నిర్మూలనలో రోటరీ కీలక పాత్ర పోషించిందని, నిరక్షరాస్యత నిర్మూలన, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత, ప్రపంచ శాంతి వంటి రంగాల్లో సంస్థ విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ రత్నాకర్ రావు, కొండలరావు, వైద్యనాథ్ చాప్టర్ అధ్యక్షుడు మాల నాగేశ్వరరావు, వర్తుల సురేందర్ రెడ్డి, బిక్కి వెంకటేశ్వర్లు, నాళ్ల వీరన్న, నాళ్ల లక్ష్మీనరసింహారావు, తోర్నాల నగేష్ కుమార్, బొల్లం శ్రీనివాస్, కొడాలి నాగేంద్రరావు, సతీష్ రావు, హత్య శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మల్లాల రమేష్, మాజీ అధ్యక్షుడు వేమిశెట్టి కిషోర్, జంగాల విజయ్ కుమార్, జంగాల మంగపతి రావు, విజయ్, నరసింహారావు గుప్తా, యువజన శివకుమార్, కట్ల వెంకన్న, ఇమ్మడి కృష్ణమూర్తి, తోడేటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
