సిద్దిపేట, జూలై 8 (చైతన్యగళం):
జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమిషనర్ కే. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతితో కలిసి దేవాదుల, గౌరవెల్లి, మల్లన్నసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న భూసేకరణ, పునరావాస సమస్యలను జిల్లా కలెక్టర్ కమిషనర్కు వివరించారు.
దేవాదుల ప్రాజెక్టు పరిధిలో చేర్యాల, కొమురవెల్లి, కొండపాక, మద్దూర్, ధూల్మిట్ట మండలాల్లో తపాస్పల్లి రిజర్వాయర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని కమిషనర్ సూచించారు. అలాగే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ కాలువల భూసేకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులకు అందించాల్సిన పెండింగ్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అంశాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్, సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.
