హుస్నాబాద్(చైతన్య గళం): సమాజ సేవే ధ్యేయంగా పనిచేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ టైకూన్ ప్రొఫెషనల్స్ (320H), సురేవిత ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా విద్యా సామగ్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు నోట్బుక్స్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ బ్యాగులు అందజేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువును కొనసాగించి ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
సర్పంచ్ మాట్లాడుతూ, విద్యార్థులకు అందించే ప్రతి విద్యా సహాయం వారి భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి సామాజిక సంస్థలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మీర్జాపూర్ గ్రామ సర్పంచ్ వేల్పుల సంపత్ కుమార్, వార్డు సభ్యులు జ్యోత్స్న, స్వరూప, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు వేణు, ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి, ఉపాధ్యాయురాలు రేఖారాణి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ సుమన్, కోశాధికారి లయన్ రంజిత్ రావు, లయన్ భావనరావు, మధు, లయన్స్ క్లబ్ సభ్యులు, సురేవిత ఫౌండేషన్ ప్రతినిధులు మహేందర్, ప్రవీణ్, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
