కరీంనగర్, జూలై 3(చైతన్యగళం):
అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థి నాయకత్వ బృందం (స్టూడెంట్ కౌన్సిల్) ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ప్రజాస్వామ్య విలువలను విద్యార్థుల్లో పెంపొందించే లక్ష్యంతో పది రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన నాయకత్వ ఎంపిక ప్రక్రియ అనంతరం ఈ కార్యక్రమం జరిగింది. మొదటగా విద్యార్థి నాయకత్వ పదవులను ప్రకటించి నామినేషన్లు స్వీకరించారు. అనంతరం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు రాత పరీక్షలు నిర్వహించి అర్హులను ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులు తమ లక్ష్యాలు నినాదాలతో ప్రచారం నిర్వహించగా ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా డిజిటల్ పోలింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం విశేషం. పారదర్శకంగా జరిగిన ఎన్నికల అనంతరం ఫలితాలను ప్రకటించారు.
తదనంతరం నిర్వహించిన ఇన్వెస్టిచర్ వేడుకలో పాఠశాల డైరెక్టర్ శ్రీ అనుదీప్ సౌగాని నూతనంగా ఎన్నికైన వైట్ బ్యాడ్జ్ హోల్డర్లు హౌస్ బ్యాడ్జ్ హోల్డర్లకు బ్యాడ్జ్లను అలంకరించి బాధ్యతలను అప్పగించారు. అనంతరం వారు క్రమశిక్షణ సేవాభావం నాయకత్వ నిబద్ధతకు ప్రతీకగా మార్చ్ నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నారు.
నూతన విద్యార్థి నాయకులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీ అనుదీప్ సౌగాని నూతన నాయకులను అభినందిస్తూ అద్విత విలువలను నిజాయితీ క్రమశిక్షణ బాధ్యత నిస్వార్థ సేవా భావంతో నిలబెట్టాలని నిజమైన నాయకత్వం ఆదర్శంగా నిలవడంలోనే ఉందని సందేశమిచ్చారు.
ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో గర్వానందాలను నింపుతూ విజయవంతంగా ముగిసింది.
