వరంగల్, జూన్ 29 (చైతన్యగళం): ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన తర్వాత తొలిసారిగా వరంగల్ నగరానికి వచ్చిన సినీ నటుడు సుమన్కు ఆర్యవైశ్య మహాసభ ఘన సన్మానం చేసింది.నల్లబెల్లి మండలంలోని రాజరాజేశ్వరి దేవస్థానానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా, వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్ గుప్త శాలువాతో సన్మానం చేసి, వరంగల్ జిల్లా గుర్తుగా నిలిచే శ్రీ భద్రకాళి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ఉన్నారు. తమ అభ్యున్నతికే కాకుండా ఇతరులను సత్కరించే గొప్ప గుణం ఆర్యవైశ్య సమాజానిదే” అని పేర్కొన్నారు.కార్యక్రమంలో జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు యాద రవి కుమార్, సినీ నిర్మాత శ్యామల గణేష్, కుచన శివ తదితరులు పాల్గొన్నారు.
