హుస్నాబాద్, జూన్ 25 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో పాప్ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన మైఖేల్ జాక్సన్ 17వ వర్ధంతి వేడుకలను ప్రముఖ సామాజిక కార్యకర్త, కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మైఖేల్ జాక్సన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన పిడిశెట్టి రాజు మాట్లాడుతూ, “ప్రపంచ సంగీత రంగంలో మైఖేల్ జాక్సన్ చేసిన సేవలు చిరస్మరణీయాలు. తన అద్భుత గాన ప్రతిభ, నృత్య నైపుణ్యంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న గొప్ప కళాకారుడు” అని కొనియాడారు.
1958 ఆగస్టు 29న జన్మించిన జాక్సన్, చిన్న వయస్సులోనే జాక్సన్ 5 బృందంతో సంగీత ప్రపంచంలోకి ప్రవేశించి విశేష గుర్తింపు పొందారని, అనంతరం సోలో గాయకుడిగా ఎదిగి ఆఫ్ ది వాల్, థ్రిల్లర్, బ్యాడ్ వంటి ఆల్బమ్లతో ప్రపంచ సంగీత చరిత్రలో కొత్త అధ్యాయాన్ని సృష్టించారని గుర్తు చేశారు.
‘బిల్లీ జీన్’, ‘బీట్ ఇట్’, ‘థ్రిల్లర్’ వంటి పాటలు నేటికీ సంగీత ప్రియులను అలరిస్తున్నాయని, మూన్వాక్ నృత్యంతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. అలాగే ‘వి ఆర్ ది వరల్డ్’ పాట ద్వారా మానవతా సేవలకు కూడా తన వంతు సహకారం అందించారని పేర్కొన్నారు.
