విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
చెన్నై, జులై 10(చైతన్యగళం): విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ పత్రాల పంపిణీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ నియామక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగ నియామకాలు కేవలం ‘తాత్కాలికం’ మాత్రమేనని న్యాయస్థానం మెలిక పెట్టింది. భవిష్యత్తులో తుది తీర్పుకు లోబడి ఈ నియామకాలు ఉంటాయని స్పష్టం చేసింది. జస్టిస్ సీవీ కార్తికేయన్, జస్టిస్ ఆర్ శక్తివేల్లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిపింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం.. ప్రభుత్వం ఈ ఉద్యోగాలు ఇవ్వడానికి అనుసరించిన మార్గదర్శకాలు ఏమిటి?.. బాధితుల కుటుంబాలకు ఆ అర్హతలు ఉన్నాయా లేదా? అనే విషయాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎలాంటి స్పష్టమైన పాలసీ లేకుండా.. విపత్తు బాధితులకు ఉద్యోగాలు కేటాయించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16 (సమానత్వ హక్కు) పరిధిలోకి వస్తుందో లేదో సమీక్షిస్తామని పేర్కొంది.
కాగా, బాధితుల కుటుంబాలకు ఈ రోజు( శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు సీఎం విజయ్ నియామక పత్రాలు అందజేయనున్నారు. అయితే, ఈ కేసును కోర్టు మళ్లీ విచారించే వరకు లబ్ధిదారులకు మొదటి నెల జీతం చెల్లించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూలై 21కి వాయిదా వేసింది.
