నలుగురు అరెస్టు – రూ.18,940 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం
కరీంనగర్, జూన్ 23 (చైతన్యగళం):కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వాసాల సతీష్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ బృందం కొత్తపల్లి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న పేకాట స్థావరంపై సోమవారం మెరుపు దాడి నిర్వహించింది.
ఈ సందర్భంగా ఏసీపీ వాసాల సతీష్ మాట్లాడుతూ, “నమ్మదగిన సమాచారం ఆధారంగా దాడి చేసి, నగదు పందాలు కాస్తూ జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను అక్కడికక్కడే పట్టుకున్నాం. వారి వద్ద నుండి రూ.18,940 నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. అరెస్టయిన నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించి, చట్టపరమైన చర్యలు ప్రారంభించాం” అని తెలిపారు.
అతను హెచ్చరిస్తూ, “నగర పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలి” అని స్పష్టం చేశారు.
