- అత్త, మరిదిపై బాధితుల ఆరోపణ.. బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 6 (చైతన్యగళం): భర్త మృతి చెందిన మూడు రోజులు గడవకముందే తనను, తన కుమార్తెను ఇంటి నుంచి బయటకు పంపించారని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడీపీఎల్ గుడిమెట్ కాలనీలో చోటుచేసుకుంది.
బాధితురాలి కథనం ప్రకారం.. గుడిమెట్ ఐడీపీఎల్ కాలనీలో నివాసం ఉంటున్న స్టాండ్లీ జోఆన ప్రసిక భర్త ఇటీవల మృతి చెందాడు. భర్త మృతి చెందిన మూడు రోజులకే తన అత్త కమలమ్మ, మరిది స్టాండ్లీ జయరాజ్ ఇంటి నుంచి తమను వెళ్లగొట్టారని ఆమె ఆరోపించింది. ఇంట్లో ఉంటే తనను, తన తల్లిని చంపేస్తానంటూ మరిది బెదిరించాడని తెలిపింది.
ఇంట్లోని కిచెన్లో ఉన్న కత్తితో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఆరోపించింది. భయంతో ఇంటి నుంచి బయటకు వచ్చిన అనంతరం బాలానగర్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బాధితురాలు పేర్కొంది.
న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం
బాధితురాలు మరియమ్మ, ఆమె కుమార్తె స్టాండ్లీ జోఆన ప్రసిక తమకు న్యాయం చేయాలని కోరుతూ మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బస్తీ మహిళా పెద్దలు తెలిపారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బస్తీ మహిళా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
