మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత – కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, ఆగస్టు 25 (చైతన్య గళం):
మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించి సమతుల్య వాతావరణాన్ని నిర్మించవచ్చని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మందమర్రి మండలం బొక్కలగుట్టలోని గాంధారి వనంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో డీసీపీ ఎ. భాస్కర్, అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ తదితరులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెట్ల వల్ల స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన ఆహారం, ఆశ్రయం లభించడంతో పాటు వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉంటుందని తెలిపారు. వన మహోత్సవంలో భాగంగా మంగళవారం ఒక్కరోజే జిల్లాలో 4 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. జిల్లాకు నిర్దేశించిన 41 లక్షల మొక్కల లక్ష్యంలో ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అనంతరం మందమర్రి మండల కేంద్రంలోని ఆర్కే గార్డెన్స్లో నిర్వహించిన రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల లక్కీ డ్రా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా ఇళ్లు కేటాయించేందుకు లక్కీ డ్రా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు ఈ కార్యక్రమాల్లో డీసీపీ ఎ. భాస్కర్, అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
