- గుర్తింపు రద్దు ఉత్తర్వులు అమలు చేయాలని ఆర్టీఐ సర్వీస్ సొసైటీ డిమాండ్
దేవరకొండ, ఆగస్టు 1 (చైతన్యగళం): కొండమల్లేపల్లిలో నిర్వహిస్తున్న ‘ఎస్పీఆర్ ఉన్నత పాఠశాల’పై విద్యాశాఖ జారీ చేసిన గుర్తింపు రద్దు ఉత్తర్వులను వెంటనే అమలు చేసి పాఠశాలను సీజ్ చేయాలని రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు కేతవాత్ బాబురామ్ నాయక్ డిమాండ్ చేశారు. పాఠశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (హైదరాబాద్) జారీ చేసిన ఉత్తర్వులు అమలులో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, కొండమల్లేపల్లిలోని వెంకటేశ్వర కళాశాల భవనంలో అవసరమైన అనుమతులు లేకుండానే ‘ఎస్పీఆర్ ఉన్నత పాఠశాల’ నిర్వహిస్తున్నట్లు తమ సంస్థ 2024 జూన్ 7న జిల్లా కలెక్టర్కు ఆధారాలతో ఫిర్యాదు చేసిందన్నారు. ఆ సమయంలో అధికారులు కొంతకాలం పాఠశాలను మూసివేసినా, అనంతరం క్షేత్రస్థాయి విచారణ లేకుండానే తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు.అలాగే, ‘ఎస్పీఆర్’ పేరును వినియోగించరాదంటూ సంబంధిత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులు ఉన్నప్పటికీ, అప్పటి జిల్లా విద్యాశాఖాధికారి విచారణ లేకుండా తాత్కాలిక గుర్తింపు మంజూరు చేశారని ఆయన ఆరోపించారు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన అనంతరం జరిగిన విచారణలో పలు అంశాలు వెలుగులోకి రావడంతో, పాఠశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు 2026 జూలై 21న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా సదరు పాఠశాల గుర్తింపు, అనుమతులను రద్దు చేసినట్లు తెలిపారు.గుర్తింపు రద్దు అయినప్పటికీ యాజమాన్యం ఇప్పటికీ అదే పేరుతో తరగతులు నిర్వహిస్తూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తోందని బాబురామ్ నాయక్ ఆరోపించారు. జిల్లా యంత్రాంగం వెంటనే పాఠశాలను సీజ్ చేసి, గుర్తింపు రద్దు ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని కోరారు.అలాగే, పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, గతంలో అనుమతులు మంజూరు చేసిన అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా గుర్తింపు పొందిన పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.గుర్తింపు రద్దు ఉత్తర్వులు అమలు చేయడంలో అధికారులు మరింత జాప్యం చేస్తే తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో కలిసి జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కేతవాత్ బాబురామ్ నాయక్ హెచ్చరించారు.
