కరీంనగర్, జూలై 29 (చైతన్యగళం):
జలవిహార్ వాకర్స్ అండ్ స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్నను బుధవారం ఘనంగా సన్మానించారు. ఇటీవల అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌతమ్నగర్లో నిర్వహించిన కట్టమైసమ్మ ప్రత్యేక పూజలు, వనభోజనాల కార్యక్రమానికి ఆయన హాజరై విజయవంతం చేసినందుకు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
అదేవిధంగా రిటైర్డ్ ఎస్సై ఎల్లయ్య గౌడ్, లేక్ పోలీస్ స్టేషన్ ఎస్సై రమేష్, కార్పొరేటర్ కొమురయ్య యాదవ్, పూరుమళ్ల శ్రీనివాస్లను కూడా ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న మాట్లాడుతూ, “కట్టమైసమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. వాకింగ్, స్విమ్మింగ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తున్న వాకర్స్ అండ్ స్విమ్మర్స్ అసోసియేషన్ అభినందనీయమైన సేవలు అందిస్తోంది. సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలి. నా మీద చూపిన ప్రేమాభిమానాలకు అసోసియేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి మంచి కార్యక్రమానికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తాను” అని తెలిపారు.
