సుల్తానాబాద్, జూలై 29(చైతన్యగళం):
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సుల్తానాబాద్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత పిలుపునిచ్చారు. అత్యవసర పనులు ఉంటే మాత్రమే ప్రజలు బయటకు రావాలని సూచించారు.ఈ సందర్భంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీ 10వ వార్డులోని గాంధీనగర్, దర్గా నగర్ ప్రాంతాల్లో వర్షంలోనే పర్యటించిన ఆమె, రోడ్లపై నిలిచిన వర్షపు నీరు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ప్రమాదకర స్థితిలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లాలని అవగాహన కల్పించారు.అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే తమను సంప్రదించాలని ప్రజలకు సూచించిన ఆమె, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులతో వెంటనే నీటిని తొలగించే చర్యలు చేపట్టించారు.
ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ టి. రమేష్, మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
