కరీంనగర్, సెప్టెంబర్ 19 (చైతన్యగళం):
ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని జేఏసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు గొట్టుముక్కుల సమ్మిరెడ్డి ఆకాంక్షించారు. రేకుర్తి వ్యాల్యూ హోమ్స్లో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆయన సతీసమేతంగా పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గణపతికి పుష్పాలు, పత్రి, పండ్లు సమర్పించి హారతి ఇచ్చారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సమ్మిరెడ్డి మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాలు భక్తిభావంతోపాటు ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయన్నారు. పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కరీంనగర్ జిల్లా మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు సుఖశాంతులు కలగాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో కాలనీ వాసులు, భక్తులు, ఉత్సవ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
