కడ్తాల్, సెప్టెంబర్ 11 (చైతన్యగళం): మారుమూల తండాకు చెందిన వ్యవసాయ కుటుంబ విద్యార్థి విస్లావత్ శివ ఎంబీబీఎస్ సీటు సాధించి ప్రతిభ చాటాడు. యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2022–23 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన శివ, కడ్తల్ మండలం పచెల్కతాండాకు చెందిన విస్లావత్ భాస్కర్, కమిలి దంపతుల కుమారుడు. ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించాడు.

ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో 700 మార్కులకు 501 మార్కులు సాధించి, ఎస్టీ కేటగిరీలో 859వ ర్యాంకు పొందాడు. దీంతో ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివి వైద్య విద్యలో సీటు సాధించిన శివను గ్రామస్తులు అభినందించారు. పీఆర్జీ ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రొద్దుటూరి రవీందర్ గుప్త, కడ్తల్ ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విస్లావత్ శ్రీనునాయక్ తదితరులు శివను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివను ఆదర్శంగా తీసుకుని స్థానిక విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ సీతారాం నాయక్, వార్డు సభ్యులు మోతీలాల్ నాయక్, పాండు నాయక్, మాన్య నాయక్, ఎం.గోపాల్ నాయక్, విస్లావత్ వెంకటేష్ నాయక్ (వెంకీ విరాట్), లక్కు, బాదు భవోజి తదితరులు పాల్గొన్నారు.
