కరీంనగర్ (చైతన్యగళం): బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం అన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాలోని కొడిమ్యాల, చింతకుంట, కరీంనగర్ ప్రాంతాల్లో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వామ్య వ్యతిరేక పోరులో ఐలమ్మ చూపిన సాహసం, పోరాట పటిమ అనన్యసామాన్యమని కొనియాడారు. అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం బహుజనులకు ఎప్పటికీ మార్గదర్శకమన్నారు. అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఐలమ్మకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రజక సంఘం అధ్యక్షుడు రాచకొండ శశిధర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాచకొండ కొమురయ్య, గుంజేటి శివకుమార్, కుంట తిరుపతి, సత్యనారాయణ రెడ్డి, రేనయ్య, సదానందం నాయక్, పరశురాం, లుక్క విజయ్, శ్రీనివాస్ నాయక్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
