దామెర, ఆగస్టు 30 (చైతన్య గళం):
గ్రామీణ రైతులకు తమ పంటలకు స్థానికంగానే మంచి మార్కెట్ కల్పించాలనే ఉద్దేశంతో దామెర గ్రామంలో తొలిసారిగా రైతు మార్కెట్ను ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం నిర్వహించే ఈ మార్కెట్ ద్వారా రైతులు తమ పంటలను దూర ప్రాంతాలకు తీసుకెళ్లకుండా గ్రామంలోనే నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి రైతులకు మెరుగైన ధర లభించేలా చేయడంతో పాటు గ్రామ ప్రజలకు తాజా కూరగాయలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యమన్నారు. రైతులు స్వయంగా పంటలను విక్రయించుకోవడం, ప్రజలు నేరుగా రైతుల వద్ద నుంచి కూరగాయలు కొనుగోలు చేయడం ద్వారా రైతు–వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడుతుందని తెలిపారు. దీంతో రైతులకు రవాణా ఖర్చులు, సమయం ఆదా కావడంతో పాటు స్థానికంగా ఆదాయ అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. దామెరలో పండే కూరగాయలకు దామెరలోనే మార్కెట్ కల్పించడం ద్వారా స్థానిక రైతులను ప్రోత్సహించి గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. భవిష్యత్తులో మార్కెట్ను మరింత విస్తరించి ఎక్కువ మంది రైతులు తమ పంటలను నేరుగా విక్రయించుకునేలా ప్రోత్సహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంకాని పద్మ, ఉపసర్పంచ్ మద్దే కుమార్, బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
