కరీంనగర్, ఆగస్టు 26 (చైతన్యగళం):
మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం కరీంనగర్లో నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు స్థానిక పోలీసు అధికారులతో కలిసి సీపీ గౌష్ ఆలం భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన మత పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు కరీంనగర్ నగరం శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని సీపీ పేర్కొన్నారు. నగరంలో కొనసాగుతున్న గంగా–జమునా తెహజీబ్కు మిలాద్ ఉన్ నబీ వేడుకలు నిదర్శనమని తెలిపారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టి, వాహనాలను మళ్లించినట్లు చెప్పారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు తీసుకున్నారని సీపీ వెల్లడించారు.
