మహబూబాబాద్(చైతన్యగళం): కొత్తగా చేయూత పథకం ద్వారా పెన్షన్ల మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో 57 సంవత్సరాలు నిండిన వృద్ధులను కూడా పథకంలో చేర్చి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి. అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం ప్రజాపాలనలో 57 సంవత్సరాలు నిండిన వృద్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటికీ చాలామందికి పెన్షన్లు అందకపోవడం బాధాకరమన్నారు. వందలాది మంది వృద్ధులు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే వారికి పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఒంటరి మహిళలకు వివిధ ధ్రువపత్రాలు, ఇతర నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి ఇబ్బందులకు గురిచేయకుండా అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. వితంతువులు, వికలాంగులకు సైతం సకాలంలో పెన్షన్లు అందేలా ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. వృద్ధులకు పెన్షన్లు మంజూరు చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో పెరుగు కుమార్, 18వ వార్డు కౌన్సిలర్ రేశపల్లి నవీన్, 25వ వార్డు కౌన్సిలర్ నర్రా సంధ్యా శ్రావణ్, చింతకుంట్ల వెంకన్న, వెలుగు శ్రవణ్, వంకాయలపాటి చిరంజీవి, బానోత్ లింగ్య నాయక్, తండ సందీప్, గాదం శ్యాంప్రసాద్ యాదవ్, నీలం వెంకటేశ్వర్లు, మందరవి ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
