పెద్దపల్లి, ఆగస్టు 23(చైతన్యగళం): మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని మర్కజ్ మిలాద్ కమిటీ, పెద్దపల్లి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ఎం.బి. గార్డెన్స్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్వయంగా రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలను ఆయన అభినందించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, యువత స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో మర్కజ్ మిలాద్ కమిటీ సభ్యులు, పట్టణ కౌన్సిలర్లు, మైనారిటీ మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.
