పాఠశాల అంటే పుస్తకాల పరిమళం వెదజల్లాలి. గురువు అంటే దిశానిర్దేశం చేసే దీపస్తంభంగా నిలవాలి. విద్యార్థి అంటే రేపటి సమాజానికి ఆశాకిరణంగా ఎదగాలి. కానీ నేడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారుతున్నాయి. అక్షరాలు నేర్చుకోవాల్సిన చేతుల్లో ఆయుధాలు.. గురువును గౌరవించాల్సిన వయసులో హింస.. క్రమశిక్షణను నేర్పే ఉపాధ్యాయుడే తన ప్రాణాలకు భయపడే దుస్థితి! ఇది ఒక్క ఘటనకు సంబంధించిన ఆవేదన కాదు.. మన విద్యా వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను, సామాజిక బాధ్యతను ప్రశ్నిస్తున్న ప్రమాద ఘంటిక.
నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యోదంతం సమాజాన్ని కలచివేసింది. పాఠశాలకు సెల్ఫోన్ తీసుకురావద్దని చెప్పడం.. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టడం.. తప్పు చేస్తే మందలించడం.. ఉపాధ్యాయురాలి బాధ్యత. కానీ అదే క్రమశిక్షణ చివరకు ఆమె ప్రాణాలను బలిగొనేంత కక్షకు దారితీసిందంటే మనం ఎక్కడ విఫలమయ్యామో ఆలోచించాల్సిందే.
గురువును ప్రశ్నించే హక్కు ఉంది.. అంతమొందించే హక్కు లేదు!
విద్యార్థికి తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంది. తనపై వచ్చిన చర్యను ప్రశ్నించే అవకాశం ఉంది. కానీ తనకు నచ్చని నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఒక ఎత్తయితే.. దానికి ప్రతీకారంగా హత్యకు పూనుకోవడం మరో ఎత్తు. ఈ తేడాను పిల్లలకు చిన్ననాటి నుంచే నేర్పించాలి. కోపం రావడం సహజం.. కానీ కోపాన్ని హింసగా మార్చకూడదని చెప్పాలి. విభేదించడం తప్పు కాదు.. హింసకు దిగడం మాత్రం నేరమని బోధించాలి.
పదో తరగతి వయసులోనే ఒక నేరాన్ని పథకం వేసి అమలు చేసే స్థాయికి పిల్లలు చేరుకోవడం వెనుక ఉన్న కారణాలను లోతుగా పరిశీలించాలి. కేవలం పోలీసు కేసు పెట్టి.. నిందితులను అదుపులోకి తీసుకుని.. న్యాయ ప్రక్రియకు అప్పగించడంతో సమస్య ముగిసిపోదు. ఈ ఆలోచన అక్కడికి ఎలా వచ్చింది? హింసను పరిష్కారంగా భావించే మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి.
ఇంట్లో పెంపకం.. పాఠశాలలో క్రమశిక్షణ
పిల్లల ప్రవర్తనలో మార్పులను మొదట గుర్తించగలిగేది తల్లిదండ్రులే. పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు? ఏం చూస్తున్నారు? ఎలాంటి వీడియోలు చూస్తున్నారు? ఎవరితో ఆన్లైన్లో మాట్లాడుతున్నారు? డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారు? వారి మాటతీరు, నిద్ర, అలవాట్లు, స్నేహాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? వంటి విషయాలను తల్లిదండ్రులు గమనించాలి.
పిల్లలకు ఖరీదైన ఫోన్ కొనివ్వడం సులభం.. కానీ ఆ ఫోన్లో వారు ఏం చూస్తున్నారో తెలుసుకోవడం అసలైన తల్లిదండ్రుల బాధ్యత.
పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి. అదే సమయంలో ఆ స్వేచ్ఛకు హద్దులు కూడా ఉండాలి. ప్రేమ పేరుతో ప్రతి కోరిక తీర్చడం, తప్పు చేసినా సమర్థించడం, పిల్లల ప్రవర్తనను పట్టించుకోకపోవడం చివరకు వారికి మాత్రమే కాదు.. సమాజానికీ ప్రమాదకరంగా మారవచ్చు.
వ్యసనాలపై ఉక్కుపాదం అవసరం
యువతను ప్రభావితం చేస్తున్న వ్యసనాలు, చెడు స్నేహాలు, హింసను ప్రోత్సహించే కంటెంట్ విషయంలో మరింత అప్రమత్తత అవసరం. పాఠశాలల పరిసరాల్లో మాదకద్రవ్యాల చలామణి, విక్రయాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. విద్యార్థుల్లో వ్యసన లక్షణాలను ముందుగానే గుర్తించేందుకు పాఠశాలల్లో కౌన్సెలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలి.
ఒక విద్యార్థి చేతిలో కత్తి కనిపించిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. అతని మనసులో కత్తి మొలకెత్తకముందే అడ్డుకోవడం ముఖ్యం.
ఉపాధ్యాయుడి చేతికి క్రమశిక్షణ.. వెనుక సమాజం అండ
విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టే హక్కు ఉపాధ్యాయులకు ఉండాలి. తప్పును ప్రశ్నించిన ఉపాధ్యాయుడు రేపు తనకు ఏమవుతుందోనని భయపడే పరిస్థితి వస్తే పాఠశాలలో క్రమశిక్షణ ఎలా ఉంటుంది? అందుకే గురువును గౌరవించే సంస్కృతిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.
ఉపాధ్యాయుడు తప్పు చేస్తే చట్టం ఉంది. పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అధికారులను ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు.
మైనర్ అనే పదం.. నేరానికి కవచం కాకూడదు
బాలల హక్కులను రక్షించడం నాగరిక సమాజం బాధ్యత. అదే సమయంలో తీవ్రమైన నేరాలకు పాల్పడే బాలల విషయంలో బాధ్యత, సంస్కరణ, పునరావాసం, మానసిక మార్గదర్శకత్వం వంటి అంశాలపై చట్టాలు మరింత ప్రభావవంతంగా ఉండాలి. మైనర్ అనే వయస్సు నేర తీవ్రతను తుడిచివేయకూడదు.. అలాగే ఒక తప్పిదంతో జీవితాంతం ముద్ర వేయడమూ పరిష్కారం కాదు. శిక్షతో పాటు మార్పు తీసుకురావడమే బాల నేర న్యాయ వ్యవస్థ అసలు లక్ష్యం కావాలి.
ఇది ఒక్క కుటుంబం సమస్య కాదు
రూపారెడ్డి హత్యను ఒక పాఠశాల ఘటనగా మాత్రమే చూస్తే మనం పెద్ద పొరపాటు చేసినట్లే. ఇది కుటుంబాన్ని ప్రశ్నిస్తోంది. పాఠశాలను ప్రశ్నిస్తోంది. పోలీసు వ్యవస్థను అప్రమత్తం చేస్తోంది. విద్యాశాఖను ఆలోచింపజేస్తోంది. సమాజాన్ని మేల్కొలుపుతోంది.
పిల్లలను పెంచేది తల్లిదండ్రులు.. తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు.. ప్రభావితం చేసేది సమాజం. కాబట్టి పిల్లల భవిష్యత్తు బాధ్యత కూడా అందరిదే.
ఇకనైనా ప్రతి పాఠశాలలో విద్యతో పాటు విలువల బోధన, మానసిక కౌన్సెలింగ్, వ్యసనాలపై అవగాహన, సైబర్ భద్రత, కోప నియంత్రణ, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించే విధానాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య నిరంతర సమన్వయం ఉండాలి. ప్రమాదకర ప్రవర్తనను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి.
చదువులమ్మ ఒడిలో కత్తులు ఎందుకు చేరాయి? అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన సమయం ఇది. ఒక గురువు ప్రాణం పోయిన తర్వాత స్పందించడం కాదు.. మరో గురువు ప్రాణం పోకుండా ముందే మేల్కొనాలి.
పాఠశాల గేటు దాటే ప్రతి విద్యార్థి చేతిలో పుస్తకం ఉండాలి.. కత్తి కాదు.
ప్రతి ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి అడుగుపెట్టేటప్పుడు భయపడకూడదు.. భవిష్యత్తును తీర్చిదిద్దే ధైర్యంతో ఉండాలి.
ప్రతి తల్లిదండ్రి పిల్లల మార్కుల గురించి మాత్రమే కాదు.. వారి మనసు గురించి కూడా అడగాలి.
అక్షరం చేతిలో ఉంటే భవిష్యత్తు నిర్మాణమవుతుంది.. ఆయుధం చేతిలో ఉంటే భవిష్యత్తే నాశనమవుతుంది.
చదువులమ్మ తోటలో మళ్లీ పుస్తకాల చప్పుడు మాత్రమే వినిపించాలి. కత్తుల సంస్కృతికి సమాజం ఇప్పుడే కళ్లెం వేయాలి.

– గొట్టుముక్కుల సమ్మిరెడ్డి
రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, కరీంనగర్
