కరీంనగర్, ఆగస్టు 14 (చైతన్య గళం): విద్యకు దూరమైన విద్యార్థులు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. ఓపెన్ టెన్త్, ఇంటర్లో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తు చేసుకుని విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని తెలిపారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రవేశాల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ తన చాంబర్లో పోస్టర్, బుక్లెట్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వివిధ కారణాలతో చదువుకు దూరమైన వారు ఓపెన్ స్కూల్ ద్వారా తిరిగి విద్యను కొనసాగించే అవకాశం ఉందన్నారు. విద్యను మధ్యలో నిలిపివేసిన వారికి ఓపెన్ స్కూల్ మంచి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. వయస్సు, పరిస్థితులు విద్యాభ్యాసానికి అడ్డంకులు కాకూడదని, అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యా లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ, ఉమ్మడి జిల్లా టీఓఎస్ఎస్ కోఆర్డినేటర్ రామడుగు రవీందర్, డీసీఈబీ కార్యదర్శి భగవంతయ్య, కోఆర్డినేటర్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
