సిద్దిపేట, జులై 25 (చైతన్య గళం):
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శనివారం భద్రతా లోపం వెలుగుచూసింది. వైద్య పరీక్షల నిమిత్తం జైలు నుంచి ఏడుగురు రిమాండ్ ఖైదీలను పోలీసులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బైక్ దొంగతనాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సాయికుమార్ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు.
పోలీస్ వాహనంలోని ఎమర్జెన్సీ డోర్ ద్వారా తప్పించుకుని పారిపోయినట్లు సమాచారం. సాయికుమార్పై పలు బైక్ దొంగతనాల కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పరారైన ఖైదీ కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
