కరీంనగర్, జూలై 22 (చైతన్యగళం):
జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమ చట్టాలు, మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ను పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.
వయోవృద్ధులు తమ పిల్లల నుంచి మెయింటెనెన్స్ కోరుతూ చేసిన దరఖాస్తులను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించాలని, ఆర్డీవో ఉత్తర్వుల మేరకు తల్లిదండ్రులకు ప్రతినెలా మెయింటెనెన్స్ అందుతున్నదీ లేదీ పర్యవేక్షించాలని సూచించారు. మెయింటెనెన్స్ చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు.

మండల స్థాయిలో సీడీపీఓ, తహసీల్దార్, ఎంపీడీవో, పోలీసు అధికారులతో కమిటీలు ఏర్పాటు చేసి వయోవృద్ధుల సమస్యలను క్రమం తప్పకుండా పరిశీలించాలని తెలిపారు. కౌన్సెలింగ్, మెయింటెనెన్స్ ఉత్తర్వుల అనంతరం కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు సిఫారసు చేయాలని సూచించారు. పోలీసు శాఖ ప్రతి 15 రోజులకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ హరిప్రసాద్, ఆర్డీవోలు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, సీడీపీఓలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
