- సమయస్ఫూర్తితో స్పందించిన రూరల్ సీఐ అంజలి, పోలీసు సిబ్బంది
మహబూబాబాద్, జూలై 22(చైతన్యగళం): రైల్వే ట్రాక్పై ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడిని మహబూబాబాద్ రూరల్ సీఐ అంజలి, ఎస్సై సుదర్శన్, బ్లూకోల్ట్స్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. బుధవారం తెల్లవారు జామున 2 గంటల44 నిమిషాల సమయంలో మహబూబాబాద్ రైల్వే ట్రాక్పై ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు డీజీ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందింది. వెంటనే రూరల్ సీఐ అంజలి వైర్లెస్ ద్వారా పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు రైల్వే ట్రాక్ పరిసరాల్లో గాలింపు చేపట్టగా, షేక్ వసీమ్ (26) ట్రాక్పై పడుకుని ఉండటాన్ని గుర్తించారు. అదే సమయంలో మణుగూరు ఎక్స్ప్రెస్ రైలు సమీపిస్తుండగా, పోలీసులు చాకచక్యంగా యువకుడిని పట్టుకుని రైల్వే పట్టాలపై నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం అతడిని మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వారి సమక్షంలో యువకుడిని అప్పగించారు.
పోలీసులు సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలను కాపాడటం పట్ల జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ అభినందించారు. వ్యక్తిగత, కుటుంబ లేదా మానసిక సమస్యలతో ఎవరూ ఆత్మహత్య వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని, సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు.