- నూతన వంతెన అంచనాలు సిద్ధం చేయాలని సూచన
నిజామాబాద్, జూలై 21 (చైతన్యగళం):
ప్రజలకు సౌకర్యంగా ఉండేలా నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదేశించారు.
నగరంలోని వినాయక నగర్ నుంచి ఎల్లమ్మగుట్టకు వెళ్లే దారిలో బాలహనుమాన్ ఆలయం పక్కన గల లో లెవెల్ బ్రిడ్జిని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “వర్షాకాలంలో వంతెన వద్ద నీరు చేరి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. బ్రిడ్జి ఇరువైపులా రోడ్డు దెబ్బతినడంతో సమస్యలు మరింత పెరిగాయి. తక్షణమే చదును చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలి” అని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా, నూతన వంతెన నిర్మాణానికి అంచనాలను సిద్ధం చేసి ప్రపోజల్ పెట్టాలని సూచించారు. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ధృవీకరించారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, ఏబీవీపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
