హుజురాబాద్, జూలై 19 (చైతన్య గళం):
రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, లేనిపక్షంలో పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ చేపడతామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి హెచ్చరించారు.
హుజురాబాద్లోని మధువని గార్డెన్స్లో పీఆర్టీయూ టీఎస్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2026 సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం, జిల్లా కార్యనిర్వాహక సమావేశం జిల్లా అధ్యక్షుడు ఐలేని కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలను నెలకు రూ.2,000 కోట్ల చొప్పున విడుదల చేసి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు ఈ నెల 21న ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల కానుందని, ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బదిలీలతో కూడిన పదోన్నతుల అంశాన్ని ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 హెడ్ ద్వారా వేతనాలు చెల్లించాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు టైమ్స్కేల్ అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల హెల్త్ కార్డులను ఎలాంటి షరతులు లేకుండా పూర్తి స్థాయిలో అమలు చేయడంతో పాటు, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు, పీఆర్సీ అంశాలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పీఆర్సీ అమలులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించిన ఆయన, కమిటీ నివేదికను వెంటనే స్వీకరించి మెరుగైన పీఆర్సీ ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే పీఆర్టీయూ టీఎస్ ఒంటరిగానే ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.
సమావేశంలో పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు ఐలేని కరుణాకర్ రెడ్డి, అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి జైపాల్ రెడ్డి, వివిధ జిల్లాల నాయకులు, 16 మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు, సుమారు 150 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
