- తలకొండపల్లిలో ఘనంగా ప్రారంభమైన మెగా ఉచిత కంటి వైద్య శిబిరం
తలకొండపల్లి, జూలై 4 (చైతన్యగళం):
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను పూర్తిగా ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, టాస్క్ (TASK) సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో తలకొండపల్లిలోని శ్రీ దేవకి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఐదవ మెగా ఉచిత కంటి వైద్య శిబిరం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనున్న శిబిరాన్ని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి చూపు భగవంతుడు ప్రసాదించిన అమూల్యమైన వరమని, చిన్నచిన్న కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ముందస్తుగా కంటి పరీక్షలు చేయించుకుని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గత రెండేళ్లుగా ఐక్యత ఆరోగ్య భరోసా కార్యక్రమంలో భాగంగా శంకర నేత్రాలయ, చెన్నై భాగస్వామ్యంతో నిర్వహించిన నాలుగు మెగా కంటి వైద్య శిబిరాల ద్వారా 569 మంది నిరుపేదలకు ఉచిత శుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహించి, 10 వేల మందికి పైగా ఉచిత కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ ఐదవ శిబిరంలో కూడా ఉచిత కంటి పరీక్షలు, కంటి అద్దాల పంపిణీతో పాటు శుక్లాల బాధితులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ సర్జికల్ యూనిట్లో పూర్తిగా ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యమే తమకు అత్యంత ప్రాధాన్యమని, భవిష్యత్తులో మరిన్ని గ్రామాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని పేర్కొన్నారు. శిబిరానికి తలకొండపల్లి మండలం, పరిసర గ్రామాల నుంచి వందలాది మంది హాజరై కంటి పరీక్షలు చేయించుకోగా, వైద్యుల బృందం అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు అందించి, శస్త్రచికిత్స అవసరమైన వారిని నమోదు చేసింది. కార్యక్రమంలో శంకర నేత్రాలయ ఎన్ఆర్ఐ సభ్యుడు నారాయణ రెడ్డి, ఎంపీడీఓ ఎం. సీతారావమ్మ, సర్పంచ్ కటికల శేఖర్ యాదవ్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
