ఆమనగల్లు, జూలై 3 (చైతన్యగళం):
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందనే విశ్వాసంతో మాజీ సర్పంచ్ రామచందర్ తన ముగ్గురు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రవేశోత్సవ కార్యక్రమంలో ఆయన తన పిల్లలను స్వయంగా పాఠశాలలో చేర్పించారు. ఈ సందర్భంగా రామచందర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా ప్రమాణాలు, ఆధునిక బోధనా విధానాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, విద్యా సామగ్రి, డిజిటల్ బోధన వంటి సౌకర్యాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలలే నాణ్యమైన విద్య అందిస్తాయనే అపోహను తల్లిదండ్రులు వీడాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఉందన్నారు. ప్రతి తల్లిదండ్రి ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ఉంచి తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. మాజీ సర్పంచ్ రామచందర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ప్రజల్లో ప్రభుత్వ విద్యపై మరింత విశ్వాసం పెంపొందించేందుకు ఇటువంటి నిర్ణయాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని వారు పేర్కొన్నారు.
సర్కారు బడిపై నమ్మకం చాటిన మాజీ సర్పంచ్
RELATED ARTICLES
