భారత్లో వాట్సాప్ యూజర్నేమ్ ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా, గోప్యతా సమస్యలను దృష్టిలో ఉంచుకొని MeitY మెటాకు నోటీసు జారీ చేసింది. సైబర్ మోసాలు, నకిలీ ఖాతాలకు అవకాశం ఉండటంతో పూర్తి సాంకేతిక వివరాలు, భద్రతా చర్యలను మూడు రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించింది.
భారత్లో వాట్సాప్లో ‘యూజర్నేమ్’ ఫీచర్ను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఫీచర్ అమలుకు సంబంధించిన వివరణ ఇవ్వాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటా కంపెనీకి నోటీసు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సమాచారం ప్రకారం.. ప్రతిపాదిత యూజర్నేమ్ ఫీచర్కు సంబంధించిన పూర్తి వివరాలను మూడు రోజుల్లోగా సమర్పించాలని మెటాను కేంద్రం ఆదేశించింది. అలాగే, ప్రభుత్వంతో జరుగుతున్న సంప్రదింపులు పూర్తయ్యే వరకు భారతదేశంలో ఈ ఫీచర్ను విడుదల చేయవద్దని స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం వాట్సాప్లో వినియోగదారులను ప్రధానంగా వారి మొబైల్ నంబర్ ద్వారానే గుర్తిస్తారు. అయితే యూజర్నేమ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే, ఫోన్ నంబర్కు బదులుగా ప్రత్యేక పేరుతో ఇతరులను సంప్రదించే అవకాశం లభిస్తుంది. గోప్యత పరంగా ఇది ప్రయోజనకరంగా కనిపించినప్పటికీ, దీనివల్ల తలెత్తే భద్రతా సమస్యలపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నకిలీ పేర్లతో ఖాతాలు సృష్టించడం, ఇతరుల పేర్లను పోలి ఉండే యూజర్నేమ్లను ఉపయోగించి మోసాలకు పాల్పడటం, సైబర్ నేరాలకు అవకాశం పెరగడం వంటి అంశాలను కేంద్రం పరిశీలిస్తోంది. అలాగే, చట్ట అమలు సంస్థలు నేరాల దర్యాప్తు చేపట్టే సమయంలో నిందితులను గుర్తించడం మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సైబర్ మోసాలు, డిజిటల్ ఫ్రాడ్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టే ముందు వాటి ప్రభావాన్ని సమగ్రంగా అంచనా వేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే మెటా నుంచి సాంకేతిక వివరాలు, భద్రతా చర్యలు, వినియోగదారుల గుర్తింపు వ్యవస్థ, చట్ట అమలు సంస్థలకు అవసరమైన సహకార విధానాలపై పూర్తి నివేదిక కోరినట్లు సమాచారం. అయితే, ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం లేదా మెటా సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. రెండు పక్షాల మధ్య చర్చలు పూర్తైన తర్వాతే భారతదేశంలో వాట్సాప్ యూజర్నేమ్ ఫీచర్ అమలుపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం.
