అప్రమత్తమైన సిబ్బంది – తృటిలో తప్పిన ప్రమాదం
కరీంనగర్, జూలై 1 (చైతన్యగళం): కరీంనగర్ ఆర్టీసీ రెండో డిపోలో బుధవారం తెల్లవారుజామున ఎలక్ట్రిక్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. టీజీ-02 టీ 1741 నంబర్ గల ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగగా, డిపో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
డిపో ప్రాంగణంలో నిలిపి ఉంచిన బస్సులోని బ్యాటరీ వ్యవస్థలో షార్ట్సర్క్యూట్ ఏర్పడటంతో మంటలు వ్యాపించినట్లు ప్రాథమికంగా అధికారులు భావిస్తున్నారు. మంటలను గుర్తించిన సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో పాటు అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేశారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వేగంగా స్పందించిన అధికారులు, సిబ్బంది చాకచక్యంతో మంటలు ఇతర బస్సులకు వ్యాపించకుండా అడ్డుకున్నారు. దీంతో డిపోలో సంభవించే భారీ ప్రమాదం తృటిలో తప్పింది.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. అయితే బస్సుకు కొంత మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను గుర్తించేందుకు అధికారులు విచారణ చేపట్టారు. ఎలక్ట్రిక్ వాహనాల భద్రతా ప్రమాణాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
