Sunday, June 14, 2026
Homeతెలంగాణకరీంనగర్సింగరేణి సంస్థ అభివృద్ధికి సమిష్టి కృషి అవసరం - ఉప ముఖ్యమంత్రి భట్టి

సింగరేణి సంస్థ అభివృద్ధికి సమిష్టి కృషి అవసరం – ఉప ముఖ్యమంత్రి భట్టి

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, జూన్ 14 (చైతన్యగళం): సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధి కోసం అందరూ కలిసి కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ మైన్ సందర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

భట్టి

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సింగరేణి సంస్థ తెలంగాణ ఆస్తి అని, కార్మికుల చెమటతో వెలుగులు అందిస్తున్న ఈ సంస్థను అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. బొగ్గు నాణ్యత, ఉత్పత్తి, నిల్వ, రవాణా వంటి అంశాలను పరిశీలించినట్లు తెలిపారు. కార్మికుల శ్రమను అపహాస్యం చేస్తూ కొంతమంది అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని, కానీ సంస్థలో ప్రతి అంశం పారదర్శకంగానే జరుగుతోందని పేర్కొన్నారు.

కార్మికుల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం అధునాతన వైద్య పరికరాలు, నూతన వైద్య విధానాలు అందిస్తున్నామని, విద్యారంగంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక సౌకర్యాలతో నవీకరిస్తున్నామని తెలిపారు. గ్రామీణ స్థాయి సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, కార్మికుల పిల్లల విద్యకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

సింగరేణి కార్మికులకు రూ.1.25 కోట్లు ప్రమాద భీమా కల్పించామని, పిల్లలకు UPSC పరీక్షలు, ఇంటర్వ్యూలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం–సింగరేణి సంస్థ సమన్వయంతో బొగ్గు గనులను మరింత అభివృద్ధి చేసి కార్మికుల సంక్షేమం దిశగా కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్, సింగరేణి సిఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!