హైదరాబాద్(చైతన్యగళం): రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి సోమవారం బీఆర్కే భవన్లోని రైతు కమిషన్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతు కమిషన్ బృందంతో ఆయన దాదాపు గంటకు పైగా సమావేశమై రాష్ట్రంలోని ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన పరిస్థితులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సూచనలు అందించేందుకు డాక్టర్ జి. చిన్నారెడ్డి అధ్యక్షతన నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి కన్వీనర్గా, మరో 25 మంది సభ్యులుగా నియమితులయ్యారు.
నిపుణుల కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా రైతు కమిషన్ కార్యాలయానికి వచ్చిన డాక్టర్ చిన్నారెడ్డికి కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు కేవీఎన్ రెడ్డి, భవానీ రెడ్డి ఘన స్వాగతం పలికి సన్మానించారు.
సమావేశంలో రాష్ట్రం, దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వర్షాభావ పరిస్థితులు, చేపట్టాల్సిన నివారణ చర్యలపై సమగ్రంగా చర్చించారు. రైతు కమిషన్ ప్రభుత్వానికి అందిస్తున్న సూచనలు, సిఫార్సులపై డాక్టర్ చిన్నారెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తూ కమిషన్ పనితీరును అభినందించారు.
ఈ సందర్భంగా ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై రైతు కమిషన్ రూపొందించిన రెండు నివేదికలను నిపుణుల కమిటీ చైర్మన్కు కమిషన్ బృందం అందజేసింది.

ఈ నెల 22న ప్రజాభవన్లో నిపుణుల కమిటీ తొలి సమావేశం నిర్వహించనున్నట్లు డాక్టర్ చిన్నారెడ్డి తెలిపారు. తన అధ్యక్షతన జరిగే ఆ సమావేశానికి హాజరుకావాలని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని ఆయన ఆహ్వానించారు.
ఎల్ నినో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నుంచి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ చిన్నారెడ్డి పేర్కొన్నారు.
సమావేశంలో రైతు కమిషన్ ఇన్చార్జ్ మెంబర్ సెక్రటరీ సంధ్యారాణి, స్పెషల్ ఆఫీసర్ కేశవులు, వ్యవసాయ రంగ నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి, కమిషన్ అధికారులు పాల్గొన్నారు.
