మహబూబాబాద్, జూలై 20 (చైతన్యగళం):
జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సోమవారం గార్ల పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, కేసుల దర్యాప్తు, రికార్డుల నిర్వహణను సమీక్షించి, పెండింగ్ కేసులను నాణ్యతతో, చట్టపరమైన విధానాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై వారి విధుల నిర్వహణ, సమస్యలు, పనితీరుపై ఆరా తీశారు. ముఖ్యంగా విలేజ్ పోలీస్ ఆఫీసర్లతో (VPOలు) మాట్లాడుతూ గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజలతో సమన్వయం కొనసాగించాలని సూచించారు. గ్రామాల్లో గంజాయి రవాణా, మత్తు పదార్థాల వినియోగంపై అప్రమత్తంగా నిఘా ఉంచి, అనుమానాస్పద సమాచారం లభించిన వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని ఆదేశించారు.
ప్రతి పోలీసు సిబ్బంది ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సత్వర సేవలు అందించాలని, ఫిర్యాదులను పారదర్శకంగా పరిష్కరించాలని ఎస్పీ పేర్కొన్నారు. బీట్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడం, రౌడీషీటర్లు, పాత నేరస్థులు, మత్తు పదార్థాల వ్యాపారుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.
అలాగే సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారుల భద్రతపై గ్రామస్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. పోలీస్ స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఎస్పీ, ప్రతి అధికారి జట్టు భావనతో పనిచేస్తూ జిల్లా పోలీస్ ప్రతిష్ఠను పెంచాలని సూచించారు.
