చిగురుమామిడి,జూలై 01(చైతన్యగళం):
చిగురుమామిడి పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన బి. జగదీశ్వర్ బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు దర్యాప్తు మరింత సమర్థవంతంగా సాగుతుందని తెలిపారు. గ్రామాల్లో ప్రజల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొంటూ, గ్రామాల్లో ఎక్కడైనా మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగం జరిగినట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆయన, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అక్రమ ఇసుక రవాణా, ఇసుక మాఫియా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపనున్నట్లు స్పష్టం చేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని ఎస్సై బి. జగదీశ్వర్ విజ్ఞప్తి చేశారు.
