కరీంనగర్(చైతన్యగళం): జ్యోతినగర్లోని సెయింట్ ఆల్ఫోన్స్ హై స్కూల్లో మంగళవారం నిర్వహించిన “బి సేఫ్టీ – సేఫ్టీ అవగాహన కార్యక్రమం”లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని రోడ్డు సూచికల చార్ట్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయని, విద్యార్థులు 18 ఏళ్లు పూర్తయ్యే వరకు వాహనాలు నడపకూడదని సూచించారు. ట్రాఫిక్ నియమాలను తాము పాటించడమే కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు కూడా అవగాహన కల్పించి రోడ్డు భద్రతకు రాయబారులుగా నిలవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నిర్వహించిన రోడ్డు భద్రత క్విజ్లో విజేతలకు కమిషనర్ నిఘంటువులను బహుమతులుగా అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేస్తున్న సంస్థల సేవలను ఆయన ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సంతోష్ రెడ్డి, ఉపాధ్యాయులు, సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొన్నారు.
