ఖానాపూర్, జూన్ 9 (చైతన్యగళం):
నిర్మల్ జిల్లా బీరవెల్లి గ్రామంలో మృగశిర కార్తె సందర్భంగా సోమవారం రాత్రి చేపమందు కార్యక్రమం ఘనంగా జరిగింది.సగం కృష్ణ వారి కుటుంబ సభ్యులు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు దాదాపు 2000 మందికి చేపమందు వేశారు. గత ఎనిమిది దశాబ్దాలుగా సగం వంశీయులు చేపమందును ఉచితంగా అందిస్తున్నారు.
మహారాష్ట్ర, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల ప్రాంతాల నుంచి వర్షం కురుస్తున్నా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మంగళవారం ఉదయం వరకు మరో 500 మంది చేపమందు కోసం వచ్చారని నిర్వాహకులు తెలిపారు.ప్రజలకు భోజన వసతి, నీటి సదుపాయం, ఎండ తాపం నుండి రక్షణ కోసం టెంట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీరవెల్లి సర్పంచ్ ఎల్లన్న, వీడీసీ సభ్యులు సహకరించారు.శాంతిభద్రతల కోసం సారంగపూర్ ఎస్సై శ్రీకాంత్ నలుగురు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.
