- తీజ్ వేడుకల్లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని శ్రీనివాస్
కరీంనగర్ (చైతన్యగళం): కరీంనగర్ నగరంలోని 11వ డివిజన్లో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, గిరిజన కుటుంబాలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
తీజ్ పండుగ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు ప్రతీకగా నిలుస్తుందని మేయర్ అన్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ పండుగ కుటుంబాల్లో సుఖసంతోషాలు, సౌభాగ్యం, ఐక్యత వెల్లివిరియాలని ఆకాంక్షించే పవిత్ర పర్వదినమన్నారు. తరతరాలుగా వస్తున్న గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
కరీంనగర్ నగరంలో అన్ని వర్గాల ప్రజలు తమ సంస్కృతి, సంప్రదాయాలను స్వేచ్ఛగా, ఘనంగా నిర్వహించుకునేలా అవసరమైన సహకారం అందిస్తామని మేయర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల నర్మదా నర్సయ్య, పొన్నం లక్ష్మి, మొండయ్య, బీజేపీ నాయకులు పండుగ నాగరాజు, ఆవునూరి భరత్, గిరిజన నాయకుడు గూగులోత్ తిరుపతి నాయక్తో పాటు కాలనీ వాసులు, మహిళలు, యువత పాల్గొన్నారు.
