- అంబేద్కర్ సాక్షిగా వినతిపత్రం సమర్పణ
కరీంనగర్ టౌన్(చైతన్యగళం): కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాలు మంగళవారంతో ముగిశాయి. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన నిర్వహించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ప్రభుత్వానికి ప్రత్యేకంగా రూపొందించిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని అంబేద్కర్ను సాక్షిగా కోరారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ నాయకుడు నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. వారం రోజుల ఆందోళనల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజా సమస్యలను అణచివేయాలని చూస్తే ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
