- ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రవాణా శాఖ సూచన
మహబూబాబాద్, ఆగస్టు 18(చైతన్యగళం): రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని JNTUH ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు, సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేటప్పుడు సీట్బెల్ట్ పెట్టుకోవాలని అధికారులు సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ ఉపయోగించడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలని తెలిపారు. సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టపరంగా నేరమని, మైనర్లు వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు సంబంధిత వాహనం రిజిస్ట్రేషన్ రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు, వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించుకుని, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్, వెంకట్ రెడ్డి, JNTUH కళాశాల ప్రిన్సిపాల్ బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
