హైదరాబాద్, ఆగస్టు 15(చైతన్యగళం): వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్ హైస్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కోడిదెల చంద్రారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన సైనికులను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమం, స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలు, దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు వారు చేసిన త్యాగాలను ప్రసంగాల రూపంలో వివరించారు. విద్యార్థుల ప్రసంగాలు, దేశభక్తి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కోడిదెల చంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు. పోటీ పరీక్షలు, ఇతర పరీక్షల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. దేశభక్తి, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పౌరులుగా విద్యార్థులు ఎదగాలని ఆయన అన్నారు.
ఈ వేడుకల్లో హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కే. పార్వతి, ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ఆర్. శంకర్రెడ్డి, సబితారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
