సిద్దిపేట, ఆగస్టు 5 (చైతన్య గళం):
భూగర్భ జలాల మట్టం తగ్గుతున్న నేపథ్యంలో వర్షపు నీటిని ఒడిసిపట్టి భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించేందుకు జలసిరి కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. ఫార్మ్ పాండ్లు, బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేసి జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఎంలు, ఏపీఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జలసిరి, శానిటేషన్ డ్రైడే, స్వచ్ఛ భారత్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫార్ముల కుట్టింపు పనుల పురోగతిని సమీక్షించారు. ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాల లభ్యత తగ్గుతున్నందున ప్రతి గ్రామంలో నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, చెరువుల్లో కొత్త బోర్వెల్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించే శాశ్వత నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. హరితహారం కింద మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. జిల్లాలోని 818 ప్రభుత్వ పాఠశాలల 62,433 మంది విద్యార్థులకు 1,073 మంది మహిళా సంఘాల టైలర్ల ద్వారా యూనిఫార్ముల కుట్టింపు పనులు జరుగుతున్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. వికలాంగ విద్యార్థులకు సదరం ధ్రువపత్రాల జారీ కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో శానిటేషన్ డ్రైడే కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి స్వచ్ఛ భారత్ లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రమేష్, జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, అదనపు డీఆర్డీఓ సుధీర్, ఏపీడీ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.
