కరీంనగర్(చైతన్యగళం): అమెరికాలోని మేరీల్యాండ్ వేదికగా నిర్వహించిన అమెరికా తెలుగు సంఘం (ఏటీఏ) 19వ మహాసభలు–యూత్ కన్వెన్షన్లో శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఈ అంతర్జాతీయ సదస్సులో విద్యా, సాంస్కృతిక, నెట్వర్కింగ్ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆచార్య ఉమేష్ కుమార్ శాతవాహన విశ్వవిద్యాలయం విద్యా ప్రగతి, పరిశోధన అవకాశాలు, అంతర్జాతీయ భాగస్వామ్యంపై వివరించారు. ఈ పర్యటన ద్వారా ప్రవాస భారతీయులు, విదేశీ విద్యాసంస్థలతో విద్యా, పరిశోధన రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని విశ్వవిద్యాలయం ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ వేదికపై శాతవాహన విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించడం విశ్వవిద్యాలయంతో పాటు కరీంనగర్ జిల్లాకు గర్వకారణమని అధికారులు పేర్కొన్నారు.
